హైదరాబాద్ కు చెందిన ప్రేమ జంట వికారాబాద్ అడవుల్లో విగతజీవులుగా కనిపించిన దృశ్యం రెండు జిల్లాల్లో కలకలం రేపింది. మొన్న బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను హైదరాబాద్ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహిత మూడు రోజుల చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చింది. ఆమె చెప్పిన విషయాలు పోలీసులకే షాకింగ్ అనిపించాయి. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత తాముండే ప్రాంతానికే చెందిన దుండగుడికి దొరికిపోయి, వాడి చేతిలో దారుణంగా అత్యాచారానికి గురైంది. ఆ దృశ్యాలను ఓ 17ఏళ్ల బాలుడు చిత్రీకరించాడు. మైనర్ బాలుడిపైనా పోలీసులు రేప్ కేసు నమోదు చేయడం గమనార్హం. వివాహేతర సంబంధంగా మొదలై దారుణ క్రైమ్ కథగా మారిన ఈ కేసు గురించి సంజీవ రెడ్డి నగర్(ఎస్ ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాలివి:

వనపర్తి జిల్లాకు చెందిన మహిళ(32)కు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కూలీ పనులు చేసుకునే ఆ మహిళ బోరబండ ప్రాంతంలో నివసిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు(22)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీళ్లిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. వాళ్లిద్దరూ లోపల కలిసుండగా, అదే ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్(23), మరో బాలుడు(17) రహస్యంగా చూశారు. యువకుడు పని కానిచ్చుకుని తన గదికి తిరిగెళుతుండగా అతణ్ని ఇస్మాయిల్ అటకాయించాడు. ఫోన్ లాక్కొని బెదిరించాడు, ఇంటి బయట అలికిడితో ఆ మహిళ బయటకు వచ్చింది. మీ అక్రమ సంబంధాన్ని బయటపెడతానంటూ ఆమెను ఇస్మాయిల్ బెదిరించి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్రమ సంబంధంతో అడ్డంగా దొరికిపోయిన మహిళను బ్లాక్ మెయిల్ చేసి ఇస్మాయిల్ ఆమెను అత్యాచారం చేస్తుండగా, 17 ఏళ్ల బాలుడు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.

నిందితులిద్దరూ వెళ్లిపోతూ ప్రియుడికి ఫోన్ (అతని దగ్గర లాక్కున్నదే) ఇచ్చేశారు. అసలే వివాహేతర బంధంతో గిల్టీగా ఉన్న వివాహిత, ఆ విషయం మరో ఇద్దరికి తెలియడం, దాన్ని అడ్డంపెట్టుకుని వాళ్లు అత్యాచారానికి పాల్పడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కలిసే చనిపోదామని ఆమె ప్రియుడు కూడా సిద్ధమయ్యాడు. ఈనెల 14న వివాహిత, ఆమె ప్రియుడు బైక్ పై బోరబండ నుంచి వికారాబాద్ సమీపంలోని కండ్లపల్లి గేటు వద్ద నీలగిరి తోటలోకి వెళ్లారు. అప్పటికే దారి మధ్యలో కొనుగోలు చేసిన విషం తాగారు. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు ఆ యువకుడు. తన సోదరుడికి ఫోన్ చేసి చనిపోబోతున్నట్లు చెప్పాడు. విషం తాగిన ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా సమాచారం అందుకున్న బాధితుడి సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే పోలీసులు కూడా ఎంటరయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం కోలుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు ఇద్దరు నిందితులపైనా రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్మాయిల్, బాలుడి కోసం గాలిస్తున్నారు. ప్రియుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.