భర్తతో గొడవపడి ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: గాజులరామారం రావినారాయణరెడ్డి నగర్‌కు చెందిన ప్లంబింగ్‌ పనులు నిర్వహించే జాదవ్‌ నరేశ్, ప్రమీల(24) భార్యాభర్తలు. వీరికి కుమారుడు అభి(3), కుమార్తె అన్విక(2) ఉన్నారు.

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో గతేడాది డిసెంబరు 9వ తేదీన ప్రమీల తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన మల్లేశ్‌కు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఇంటి ఓనర్‌ ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో బంధువుల ఇళ్లల్లో వారి కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. కాగా ఈ నెల 19వ తేదీన తన భార్య ఫోన్‌ చేసిందని, మరలా కాల్‌ చేస్తే స్పందించడం లేదని నరేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.