హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ కేసు కథ సుఖాంతమైంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటకు చెందిన గాయత్రి అనే యువతి అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు తక్కువ సమయంలోనే గాయత్రి ఆచూకీని గుర్తించారు.

పూర్తి వివరాలు దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విధులకు వెళ్తున్నానంటూ చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె రాత్రి పది గంటలు దాటినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె ఫోన్ కి కాల్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో సూపర్ మార్కెట్ సిబ్బందిని సంప్రదించగా అసలు ఈ రోజు విధులకే హాజరు కాలేదని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి గాలించారు.

కేపీహెబ్బీ కాలనీలోని సర్దార్ పటేల్ నగర్లో గాయత్రి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసకున్నారు. అక్కడి నుండి దుండిగల్ పీఎస్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అలాగే తనకు పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు గాయత్రి రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. మరోవైపు గాయత్రి పక్కా ప్లాన్ ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసి.. పీఎఫ్ డబ్బులు కూడా తీసుకున్నట్లు సూపర్ మార్కెట్ సిబ్బంది చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.