దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గోవాలో హస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు గుడ్‌ బై చెప్పారు. దీంతో గోవా రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. వివరాల ప్రకారం: గోవాలో కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ మేరకు గోవా బీజేపీ చీఫ్‌ సదానందా సెట్‌ తనవాడే వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ: గోవాలో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో సైతం భేటీ అయ్యారు.

ఇక, బీజేపీలో చేరుతున్న వారిలో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత మైఖేల్‌ లోబో కూడా ఉన్నారు. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు రెండు నెలలుగా కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు గోవా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.