ఇద్దరు మిత్రుల మధ్య పరుగు పందెం పోటీ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. కాజీపేట రైల్వే ఎస్సై జితేందర్‌రెడ్డి కథనం ప్రకారం.
ఢిల్లీకి చెందిన ప్రణవ్‌సింగ్ (24), రాజస్థాన్ కోటకు చెందిన రజత్ వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ప్రణవ్‌సింగ్, రజత్ లు స్నేహితులు. ఇద్దరూ ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లేవారు.

అయితే రోజులాగే శుక్రవారం రోజున కూడా వాకింగ్ కు వెళ్లారు. బోడగుట్ట సమీపంలోని గుట్ట ఎక్కాలని రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు. నిట్ హాస్టల్‌ నుంచి బయటకు వచ్చి పరుగు పందెం ప్రారంభించారు. ఒకరినొకరు కలుసుకోకుండా పరుగు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ప్రణవ్‌సింగ్ బోడగుట్టకు వెళ్లే క్రమంలో రైల్వే యార్డ్‌లో గూడ్స్ రైలు ఆగి ఉంది. రైలు పట్టాలు దాటేందుకు గూడ్స్ రైలు పైకి ఎక్కి దిగుతుండగా హై టెన్షన్ విద్యుత్ వైరు తగిలి ప్రణవ్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతున్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించారు.