మరో 20 రోజుల్లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బుధవారం అర్ధరాత్రి చిలుకూరు గ్రామ శివారులోని శివరాత్రి నగర్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం: చిలుకూరు గ్రామానికి చెందిన పొందూరి సత్తిబాబు కుమారుడు పొందూరి ఉదయ్‌కిరణ్‌(25)తో పాటు అదే గ్రామానికి చెందిన మారోజు శివ బైక్‌పై హుజూర్‌నగర్‌ వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యలో చిలుకూరు గ్రామ శివారులోని శివరాత్రి నగర్‌ దగ్గరకు రాగానే బైక్‌ను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌ వెనుక కూర్చున్న ఉదయ్‌కిరణ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. బైక్‌ నడుపుతున్న శివకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చిక్సిత నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

ఉదయ్‌కిరణ్‌ మృతదేహానికి కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనట్లుగా ఎస్‌ఐ చల్లా శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మృతుడి తండ్రి సత్తిబాబు గురువారం ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడు ఉదయ్‌కిరణ్‌ బీటెక్‌ పూర్తిచేసి అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు అన్ని ఏ ర్పాట్లు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరగకపోతే మరో 20 రోజుల్లో అమెరికాకు వెళ్లేవాడని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఉదయ్‌కిరణ్‌ అకాల మరణంతో చిలుకూరు గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.