జగిత్యాలలో ఓ ఎన్నారై వరుడు పెళ్లిని ఆపేందుకు హైడ్రామా క్రియేట్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు వారు నిలదీయగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అడ్డం తిరిగాడు. ఇష్టంలేని పెళ్లి ఆపేందుకు సినిమాల్లో హీరోహీరోయిన్లు నాటకాలు ఆడటం చూస్తూనే ఉంటాం. ఆ తరహాలోనే జగిత్యాల ఓ ఎన్నారై పెళ్లికొడుకు సుమారు ఐదు గంటల పాటు డ్రామా క్రియేట్ చేసి అందరినీ ఫూల్స్ చేశాడు. చివరికి అసలు సంగతి బయటపెట్టడంతో పెళ్లి రద్దయింది. హనుమకొండకు చెందిన అన్వేష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమై వారం రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ అయింది. కట్నకానుల కింద రూ.25లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కాగా వధువు తరపువారు ముందుగానే రూ.15లక్షలు ముట్టజెప్పారు. ఆదివారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం కళ్యాణ మండపానికి చేరుకున్న అన్వేష్ బాత్‌రూమ్‌ కాలుజారి పడ్డానని చెప్పడంతో బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పూర్తయి మండపానికి చేరుకున్నాక అనారోగ్యంగా ఉందంటూ మరో ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ఎలాంటి సమస్యా లేదని చెప్పి పంపేశారు. అయినా కూడా వివిధ కారణాలతో సుమారు ఐదు గంటల పాటు హైడ్రామా క్రియేట్ చేశాడు. అతడి తీరుపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు గట్టిగా నిలదీయగా తనకు పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. పెళ్లి ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి గానీ.. పీటల మీదికి వచ్చాక ఇలా చేస్తావా అంటూ వధువు తరపువారు వరుడికి చీవాట్లు పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించగా పెద్దలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రం ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.