హనుమకొండ జిల్లాలోని కటక్షాపూర్ – ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాలు: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కటక్షాపూర్ – ఆత్మకూరు మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారు మేడారం వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది.
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయకచర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..