గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం కూడా లీకైందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. గ్రూప్-1 పరీక్షను కూడా ప్రవీణ్ రాశాడు. కానీ ఈ పరీక్షకు ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. కానీ ఈ పరీక్షలో ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ -1 పరీక్ష రాసిన ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చిన ఎందుకు క్వాలిఫై కాలేదని పోలీసులు ఆరా తీశారు. టీఎస్పీఎస్సీ నిబంధనలకు విరుద్దంగా ఆన్సర్ షీట్ లో ప్రవీణ్ తప్పుగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. దీంతో ప్రవీణ్ క్వాలిఫై కాలేదు. 160 మార్కుల పేపర్ లో 103 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షల సమయంలో కూడా ఇప్పటి మాదిరిగానే పేపర్ ను ముందుగానే ప్రవీణ్ తెలుసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వాస్తవాలను తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రవీణ్ ఉపయోగించిన ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. 2022 అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. 2.60 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో సుమారు 26 వేల మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జూన్ 5 నుండి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకవేళ గ్రూప్-1 పేపర్ ప్రశ్నాపత్రం కూడా లీకైతే ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.