యువతి ఇంటికి వెళ్లిన యువకుడు (19) అప్పుడే ఆమె తండ్రి రావడంతో పారిపోయే క్రమంలో నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బోరబండలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ బేకరిలో పనిచేస్తున్న యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి అనూహ్య రీతిలో దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్‌లోని బోరబండ పరిధిలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు అప్పుడే ఆమె కుటుంబసభ్యులు రావడంతో పారిపోయే క్రమంలో దుర్మరణం పాలయ్యాడు. నాలుగో అంతస్తు పైనుంచి దూకి మృతి చెందాడు. మహమ్మద్ షోయబ్ (19) అనే యువకుడు బోరబండలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. తరచూ బేకరీకి వచ్చే అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆదివారం (ఆగస్టు 6) రాత్రి పిజ్జా తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో యువతి తండ్రి ఇంటికి తిరిగొచ్చాడు.

యువతి తండ్రి కంటబడితే గొడవ జరుగుతుందని భయపడిన షోయబ్‌ ఏం చేయాలో పాలుపోక కంగారులో భవనం నాలుగో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిజ్జా ఇచ్చేందుకు షోయబ్ తమ ఇంటికి వచ్చాడని, ఇంతలో తాను రావడంతో ఆందోళనకు గురై భవనం పైనుంచి దూకేశాడని యువతి తండ్రి పోలీసులకు తెలిపాడు.