పెళ్లిళ్లు స్వర్గంలో జరిగే సంగతేమోకానీ సికిందరాబాద్ లో మాత్రం చూడ ముచ్చటైన పెళ్లి జరిగింది, అబ్బాయి ఎత్తు 5.4 అడుగులు, అమ్మాయి ఎత్తు 3.2 అడుగులు, వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఆదర్శ జంటగా నిలిచారు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు వేదికైంది. గురువారం రాత్రి 8 గంటలకు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్‌ (25)ది సిద్దిపేట. తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి మృతి చెందడంతో కొంతకాలంగా అక్క దగ్గరే ఉంటూ పీజీ పూర్తి చేశాడు.

ఇక పెళ్లి కుమార్తె వీరవల్లి రవళి (22). తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ. వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉండగా, వీరిద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. వధూవరులు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.