యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా అమ్రాపాలి తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. మన వరంగల్ కలెక్టర్ గా ఉన్న సమయంలో ఈమె పరిపాలన దూకుడు ప్రభుత్వ వ్యవహారాల్లో చొరవతో మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ఆమె తన తోటి బ్యాచ్ మేట్ ఐపీఎస్ అయిన సమీర్ శర్మను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచే అమ్రాపాలి తనను కేంద్ర సర్వీసుల్లోకి మార్చాలని కేంద్రానికి అర్జీ పెట్టుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించింది. అయితే అది వెంటనే కార్యరూపం దాల్చలేదు.

వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గా హైదరాబాద్ కు బదిలీ అయ్యింది అమ్రాపాలి. ఆ తరువాత ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కార్యాలయంలో జాయింగ్ సెక్రెటరీగా లూప్ లైన్ పోస్టులోకి మారారు. ఇక అప్పటి నుంచి మీడియాలో కనిపించకుండా పోయారు. పెద్దగా పరిపాలనలోనూ ఆమె ముద్ర కనిపించలేదు. అయితే తాజాగా అమ్రాపాలికి అద్భుతమైన పోస్టింగ్ దక్కింది.

ఏకంగా కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ లో డిప్యూటీ సెక్రెటరీగా అమ్రాపాలిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈమె ఏకంగా ప్రదాని నరేంద్రమోడీకే రిపోర్ట్ చేసే పోస్టును దక్కించుకోవడం విశేషం. నాలుగేళ్ల పాటు అమ్రాపాలి ఈ పోస్టులో ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అమ్రాపాలిని రిలీవ్ చేసింది. దీంతో కేంద్రంలో అత్యున్నత పదవిలో ఈ డైనమిక్ ఆఫీసర్ కొలువు దీరుతుండడం విశేషం…