ముంబై: యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్‌ యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో వస్తాయి. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభమైనట్లు రేజర్‌ పే ప్రకటించింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్‌సీపీఐ ఫీచర్‌ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్‌వే తామేనని రేజర్‌ పే తెలిపింది. తమ చెల్లింపుల గేట్‌వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని రేజర్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను మొదట పొందుతారని తెలిపింది. ఇప్పటికే రూపేక్రెడిట్ కార్డ్‌ల చెల్లింపులు మొదలైన సంగతి తెలిసిందే.

యూపీఐ క్రెడిట్ కార్డ్‌ లింకింగ్‌ ద్వారా కస్టమర్‌లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్‌లను అన్ని సమయాల్లో తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.తద్వారా చోరీ, లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలు లేకుండా కస్టమర్‌లకు భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్‌ల వద్ద సున్నితమైన కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పునుంచి తప్పిస్తుంది.
కాగా దాదాపు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నారు మరియు దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాలలో 30 శాతం పెరిగింది.