వారి సంసారంలో అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల ప్రకారం: తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తన ఎదురింటికి చెందిన కౌసల్య(23)ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య సెయ్యారులోని షూ కంపెనీలో పనిచేస్తోంది. దంపతులకు ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ఇదిలా ఉండగా భార్యపై అనుమానంతో రంజిత్‌ తరచూ ఘర్షణ పడేవాడు. వీటితో పాటు రంజిత్‌ తండ్రి రాజ, తల్లి శాంతి తరచూ వరకట్నం కోసం వేధించేవారు.

గత కొద్ది నెలల క్రితం భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరితో చర్చించి ఇంటికి పంపి వేశారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో భార్యపై అనుమానంతో రంజిత్‌ ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో ఆగ్రహించిన రంజిత్‌ భార్య తాళి దారంతోనే గొంతు బిగించి హత్య చేసి తన కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అనకావూరు పోలీసులు కేసు నమోదు చేసి కౌసల్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి రంజిత్‌ కోసం గాలిస్తున్నారు.