ఓయో హోటల్‌ గదుల్లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చి అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం: నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్‌ బుక్‌చేసి కమిషన్‌ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వైరల్‌ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు.

అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్‌ సెంటర్‌ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్‌, అబ్దుల్‌ వహవ్‌, పంకజ్‌ కుమార్‌, అనురాగ్‌ కుమార్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్‌లు, 22 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.