పెళ్లైనా కొత్తలో బాగానే చూసుకున్నా ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించాడు. కోడలి రజనిని కన్నకూతురిలా చూసుకోవాల్సింది పోయి సమయం చూసి తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టాడు మామ మోహన్ సింగ్. కాళ్లు నొప్పులుగా ఉన్నాయ్ ఒత్తమని చెప్పి ఆ సాకుతో అసభ్యకర పనులు చేసేవాడు. ఆ కోడలు ఎంత వద్దని వారించినా వినేవాడు కాదు ఆ దుర్మార్గుడు. తన కామ వాంఛ తీర్చమని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం విని అవాక్కయిన బాధితురాలు అత్తను తల్లిలా భావించి జరిగిన సంగతి చెప్పింది. కోడలిని కూతురులా భావించి మంచీ చెడు చూసుకోవాల్సిన అత్త సైతం ఆ దుర్మార్గుడికే వంత పాడింది. ఆ తర్వాత ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు కూడా చెప్పింది. అతగాడు తక్కువేమీ తినలేదు.

ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది నోరు మూసుకుని కూర్చొమనేవాడు. వారి మనసులోని దురాలోచనను బయటపెట్టేసరికి తట్టుకోలేని కోడలు వారితో వాదనకు దిగింది. బాగా చూసుకుంటామని చెప్పి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించింది. దీంతో మామ ఈ సారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఎలాగైనా కోడలిని లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలని భావించిన అతడికి నిరాశ ఎదురయ్యే సరికి శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అయినా లొంగపోయేసరికి మార్చి 4న భర్త, అత్త, మామలు ఆమెను కాల్చి చంపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై హర్యానా పల్వాల్ జిల్లాలోని చాంధత్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.