మాటరాని మౌనం , మాట మూగబోయినా మనసు ప్రేమ పల్లవి అందుకుంది చూపులు , సైగలతోనే మనసులు ఒకటై పెళ్లిపందిరి వేశాయి. మూగ యువతి, యువకుడి మధ్య చిగురించిన స్నేహం చివరికి ప్రేమగా మారింది. సైగలతోనే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
వేదికగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంచుకుని అక్కడే రిజిస్ట్రేషన్ మ్యారేజీ చేసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తున్న చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన మండల సురేశ్, నల్గొండ జిల్లా కనగల్లు మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన చినగాని యాదమ్మ ప్రేమించుకున్నారు.
గత నెల 13న మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా నిబంధనల మేరకు బుధవారం సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి సమక్షంలో మూగ జంట దంపతులుగా ఒక్కటయ్యారు. వరుడి తరఫు బంధువులు, కొందరు మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.