మృతదేహం పక్కనే నిద్రించిన యువకుడు
టీవీలో పాత సినిమా పాటలు కావాలని తండ్రి, కొత్త పాటలు చూడాలని కొడుకు ఇద్దరూ రిమోట్ కోసం గొడవ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న కొడుకు ఆవేశంతో రోకలిబండతో తండ్రి తలపై విచక్షణారహితంగా మోదాడు. దీంతో తండ్రి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
నల్గొండ వన్టౌన్ సీఐ సురేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: ప్రకాశంబజార్ ప్రాంత వాసి పెరుమళ్ల గోవర్ధన్(65)కు కుమార్తె జ్యోతి, కొడుకు సతీష్ ఉన్నారు. పదేళ్ల క్రితం గోవర్ధన్ భార్య అనారోగ్యంతో మృతిచెందగా నాలుగేళ్ల క్రితం జ్యోతికి వివాహం చేశారు. ఏడాది నుంచి తండ్రీకొడుకులు నల్గొండలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గోవర్ధన్ ఇంటి నిర్మాణపనుల్లో కూలీగా సతీష్ మునుగోడు తహసీల్దార్ కార్యాలయంలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
మద్యానికి బానిసైన సతీష్ ఇటీవల తండ్రితో పలుమార్లు గొడవకు పాల్పడినట్లు తెలిసింది. గురువారం రాత్రి తాగి వచ్చిన సతీష్, టీవీ చూస్తున్న తండ్రితో ఛానల్ మార్పు విషయంలో ఘర్షణకు దిగి హత్య చేశాడు. రక్తం మడుగులో ఉన్న తండ్రి మంచంపైనే కొంతసేపు నిద్రపోయాడు. తెల్లవారు జామున లేచిన సతీష్ తండ్రి చనిపోయాడని సోదరికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని మరణానంతర పరీక్షలు నిర్వహించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ చెప్పారు