నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడడంతో వారిని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా కార్యాలయ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా సరదా వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. ఈ టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ కావడంతో కార్పొ రేషన్‌ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనులను పక్కనపెట్టి ఇలా టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కార్పొరేషన్‌ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మొదటి చర్యగా ఆయా ఉద్యోగుల సెక్షన్లు మార్చారు. అయితే టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో మరింత హల్‌చల్‌ చేయడంతో వారిని శానిటేషన్‌ విభాగానికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.