పొద్దస్తమానం టిక్‌టాక్‌ చూస్తుంటే చదువేం కావాలని కుటుంబీకులు మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంటినుంచి పరారైన సంఘటన పలమనేరు పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక బజారువీధిలో కాపురముండే రవి, శాంతి దంపతుల కుమార్తె భూమిక (16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ మధ్య ఎక్కువగా మొబైల్‌లో టిక్‌టాక్‌కు చూస్తోంది.

రెండ్రోజుల క్రితం తన సోదరుడు నవీన్‌తో కలసి టిక్‌టాక్‌ వీడియో చేస్తుండగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీన్ని గమనించిన వారి తల్లి స్మార్ట్‌ఫోన్‌ను లాక్కుని వారి దుకాణానికి వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో విచారించినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం స్థానిక పోలీసులకు తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ శాంతి ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ శ్రీధర్‌ దీనిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.