టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రంపాడు – పొట్టెపాడు గ్రామాల మధ్య శ్రీనివాస్ మృతదేహం లభించింది. దీంతో అతడు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మ జిల్లాలో ఈనెల 8న మాజీ ఎంపీటీసీ ఎన్.శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే, అతడిని విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అతడు ఇంటికి రాలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ మృతదేహం బయటపడింది. శ్రీనివాసరావు పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందుకే అతడిని చంపినట్టు చర్ల శబరి ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో ఓ లేఖ కూడా లభించింది. ‘నల్లూరు శ్రీనివాసరావును ఇన్‌ఫార్మర్ అయినందుకే ఖతం చేశాం. ఇంటెలిజెన్స్ పోలీసులతో కలసి పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను తయారు చేస్తున్నాడు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడం, ప్రజాసంఘాల వారిని అరెస్టులు చేయిస్తున్నాడు. ఆదివాసీలకు చెందిన 70 ఎకరాలు అక్రమంగా గుంజుకున్నాడు. ఆదివాసీలకు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులకు అడ్డుగా నిలవడంతో నల్లూరు శ్రీనివాసరావును ఖతం చేశాం.’ అని రాసి ఉన్న లేఖ మృతదేహం వద్ద దొరికింది.