వేలూరు: తమిళనాడు జనవనరుల శాఖ మంత్రి, డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ అన్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, మంత్రి దురై మురుగన్‌ అన్న మహాలింగం కుమార్తె భారతి(55) తన భర్త రాజ్‌కుమార్‌తో కలిసి కాట్పాడిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, సోమవారం సాయంత్రం కాట్పాడి సమీపంలోని లత్తేరి వద్ద రైలు కింద పడి ఆమె మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భారతి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.