చెన్నై: తల్లీకుమార్తెపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు: రాణిపేట జిల్లా ఆర్కాట్‌ మాసపేటకు చెందిన భాస్కర్‌ (33) గంజాయి వ్యాపారి. భార్య దుర్గ(28). అదే ప్రాంతంలో వివాహిత (40) భర్తతో విడిపోయి తన 17ఏళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె ఆర్కాట్‌లోని ఓ షూ కంపెనీలో పనిచేస్తుండగా, కుమార్తె ప్లస్‌ 2 చదువుతోంది. భాస్కర్‌ భార్య దుర్గకు ఆ మహిళతో అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కొద్ది నెలల క్రితం భాస్కర్‌ గంజాయి కేసులో అరెస్టయి వేలూరు జైలులో ఉన్నాడు. గత వారం జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో భాస్కర్‌ నవంబర్‌ 28న భార్యతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. దుర్గ బయటి నుంచి తలుపు తాళం వేసి కాపలాగా నిల్చుంది.

భాస్కర్‌ మహిళను బాత్‌రూమ్‌లోకి తోసి బయట తలుపు వేసి ఆమె కుమార్తెను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. నగ్నంగా నిలబెట్టి సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత బాత్‌రూమ్‌లో ఉన్న వివాహితను కూడా కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం చెబితే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. తరచూ వీడియో చూపించి మహిళను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడేవాడు. మనస్తాపానికి గురైన మహిళ శనివారం రాణిపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద భాస్కర్‌తో పాటు అతని భార్య దుర్గపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.