ప్రియుడి తండ్రి ఆత్మహత్య


పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కాక ముందే ఓ నవ వధువు తన ప్రియుడితో ఉడాయించింది. మెడలో తాళిబొట్టు అత్తారింటిలో పెట్టేసి , 70 సవర్ల నగలతో ఉడాయించింది. కొత్తపెళ్ళికూతురుతో తన కుమారుడు పారిపోవడంతో అవమానంగా భావించిన ఆప్రియుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్యాకుమారి జిల్లా ఇరుదాం కాట్టుకు చెందిన వేల్‌ మురుగన్‌(29) కలెక్టరేట్‌లో పనిచేస్తున్నాడు. పరచూరుకు చెందిన రాజేశ్వరితో గత నెల వేల్‌ మురుగన్‌ వివాహం జరిగింది. పది రోజుల పాటుగా ఈ దంపతులు ఆనందంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గత వారం రాజేశ్వరి పత్తా లేకుండా పోయింది.

ఆమె కోసం గాలించినా ఫలితం లేక పోవడంతో విళి సందై పోలీసులకు భర్త వేల్‌ మురుగన్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో రాజేశ్వరి కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆమె ఇంటి పక్కనే ఉన్న సంతోష్‌ జాడ కూడా కాన రాక పోవడంతో అనుమానాలు బయలు దేరాయి. సంతోష్‌ కోసం గాలించినా సమాచారం లభించ లేదు. చివరకు బెంగళూరులో ఉన్న సంతోష్‌ స్నేహితుడుగోపు వద్ద జరిపిన విచారణలో ఆ ఇద్దరు గుట్టు వెలుగులోకి వచ్చింది. తన ఇంటి పక్కనే ఉన్న నిరుద్యోగి సంతోష్‌ను గత కొన్నేళ్లుగా రాజేశ్వరి ప్రేమిస్తూ వచ్చింది. అయితే, అతడికి ఉద్యోగం లేని దృష్ట్యా, చివరకు తండ్రి చెప్పినట్టుగా వేల్‌ మురుగన్‌ను వివాహం చేసుకుంది. అయితే, సంతోష్‌ను మరచిపోలేని రాజేశ్వరి అతడితో పారి పోవడం వెలుగు చూసింది..