తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం ఎలా అనే దానిపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ను ఎదుర్కొనేందుకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై బీజేపీ కూడా అదేస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలను ప్రొత్సహించేందుకు ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఇద్దరు ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ ఏ రకమైన బాధ్యతలను అప్పగించిందనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలను బీజేపీ ఏ రకంగా ఉపయోగించుకుంటుందనే అంశంపై చాలారోజులుగా చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. అయితే ఈ ఇద్దరు నేతలు తమ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కలిసి ఏయే అంశాలపై చర్చించారనే దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తమలో ఒకరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఈ ఇద్దరు నేతలు కోరినట్టు కూడా ప్రచారం సాగింది.
మరోవైపు తమ ద్వారా పార్టీలోకి చేరికలు పెద్ద ఉండాలని బీజేపీ ఆశిస్తుందని తెలుసుకున్న ఈ ఇద్దరు నేతలకు ఇందుకోసం తమకు పార్టీలో ముఖ్యమైన పదవులు ఇవ్వాలని కోరారని బీజేపీలోనూ కొందరు చర్చించుకుంటున్నారు. అయితే అంతిమంగా ఈ ఇద్దరు నేతలకు బీజేపీ పెద్దలు ఏం చెప్పారు ? ఏమైనా పదవులు ఇచ్చే విషయంలో ఇద్దరు నేతలకు స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారా ? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు, అయితే గుజరాత్ ఎన్నికలు పూర్తయిన తరువాత తన ఫోకస్ అంతా కర్ణాటక, తెలంగాణ మీదే పెట్టాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెలంగాణపై ఎక్కువగా దృష్టి పెడుతుందని.. అప్పుడు ఈ ఇద్దరి నేతల సేవలను పార్టీ ఏ రకంగా వినియోగించుకుంటుందనే అంశంపై క్లారిటీ వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు పార్టీలో చేరిన కొత్త నాయకులు, ఇతర నేతలకు వారి తగ్గ బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు సమాయత్తం చేసే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది.