తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్ 24వ తేదీన దళిత మహిళపై జరిగిన హత్యాచారం ఘటనలో బాధితురాలి పేరును మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఆమె పేరు ‘సమత’ అని పెట్టారు. ఇకపై ఈ కేసుకు సంబంధించి బాధితురాలి పేరును సమతగా పిలవాలని మీడియాకు సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ 24న లింగపూర్ మండలం ఎల్లప్పటూర్ గ్రామ శివారులో ఊరూరా తిరిగి పిన్నీసులు అమ్ముకునే ఓ దళిత మహిళ మీద కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ ఘటన జరగడానికి మూడు రోజుల ముందే ఈ ఘటన జరిగింది. అయితే, దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సమతకు కూడా న్యాయం చేయాలని కోరుతూ తాజాగా దళితులు, ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. దళిత మహిళ మీద హత్యాచారం చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు కేసును త్వరగా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి కేసుల్లో బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని వారం రోజుల్లో వచ్చేలా చూస్తామని చెప్పారు. బాధితురాలి ఇద్దరు పిల్లలను వారి కోరిక మేరకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందించడానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.