హైదరాబాద్‌: గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్ధరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హతుడి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం: నల్గొండ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన కె. ప్రియాంక, అలియాస్‌ దీప్తి(27)కి పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చి ఉదయ్‌కుమార్‌ అనే వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. అతను గతేడాది కరోనాతో మృతి చెందాడు. దీంతో ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఫిలింనగర్‌కు చెందిన ఎ. సాయికుమార్‌ అలియాస్‌ రాజ్‌కుమార్‌(22)తో షేర్‌ చాట్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడి వివాహేత సంబంధానికి దారితీసింది. గత అక్టోబర్‌లో వనస్థలిపురం కమలానగర్‌ కాలనీకి ప్రియాంక మకాం మార్చింది. సాయికుమార్‌తో పాటు మరో వ్యక్తితో ప్రియాంక సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా, రెండో భర్త స్నేహితుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్‌(32) ఆమె యోగ క్షేమాలు చూసేవాడు.

గత డిసెంబర్‌ 10న శ్రీనివాస్‌ ప్రియాంక ఇంటికి రాగా, సాయికుమార్‌ కనిపించాడు. దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్‌ ఇంట్లో ఉన్న రోకలిబండతో శ్రీనివాస్‌ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్‌లో చెప్పింది. అతడి సలహా మేరకు శ్రీనివాస్‌ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్‌పై విజయపురికాలనీ బస్టాప్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డ నిందితులు మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును మాత్రం గుర్తించలేదు. పోలీసులకు ఈ కార్డు లభించింది. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.