కరోనా యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాజిటివ్ వచ్చిన వారికి కుటుంబ సభ్యులే దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ వైద్య సహాయం అందించడానికి కూడా పలువురు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మల్ భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బాధితురాలికి ప్రసవం చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కి చెందిన గర్భిణిని ప్రసవం కోసం భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొదట ఆమెకి కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణం అయింది. దీంతో వైద్యురాలు పద్మావతి ఆధ్వర్యంలో నర్సులు శైలజ, సునీత, అనసూయ పీపీఈ కిట్లూ ధరించి గర్భిణికి సాధారణ కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ పద్మావతి తెలిపారు. థర్డ్ వేవ్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో ఇలా కరోనా పేషెంట్‌కి నార్మల్ డెలివరీ చేయడం హర్షించదగ్గ విషయమని, ప్రజలు డాక్టర్ పద్మావతి చేసిన సేవలను కొనియాడుతున్నారు.