మెదక్‌: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా హవేలీఘనపూర్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం: గ్రామానికి చెందిన బాబు–నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్తుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఆడుకుంటూ రోడ్డుదాటే ప్రయత్నం చేసింది. అదే గ్రామంలోని ఓ రైస్‌ మిల్‌ యజమాని కుమారుడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కీర్తన రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి అక్కడే చనిపోయింది. కారు డ్రైవర్‌ ప్రమాదస్థలం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. అదే కారులో చిన్నారిని మెదక్‌ పట్టణంలోని ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ మురళీ తెలిపారు..