దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చిన భార్యతో సహా ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని పుళల్‌ బుద్దగరం వెంకటేశ నగర్‌ 13వ వీధికి చెందిన సురేష్‌ (24కి విల్లుపురానికి చెందిన అనసూయతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లోకేష్‌ అనే కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం పుళల్‌ పోలీసు స్టేషన్‌కు సురేష్‌ మృతి చెందినట్టు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ తంగదురై ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు.

సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు విచారణలో అనసూయను విచారించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆమె భర్త సురేష్‌ తరచుగా మద్యం సేవించి తగాదాకు దిగేవాడని తెలిపింది. దీంతో తన బంధువు మారన్‌ (22)ను పిలిపించి, అతని సాయంతో భర్త సురేష్‌ గొంతును దుప్పట్టాతో నులిపి హతమార్చినట్లు తెలిపింది.

ముందుగా సురేష్‌కు దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పినట్లు తెలిపింది. ఆ తర్వాత మారన్‌ సాయంతో ఉరిపై వేలాడదీసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అనసూయను పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మారన్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు…