యశవంతపుర: వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్తను కాటికి పంపింది. వివరాలుః ప్రైవేట్‌ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న శంకర్‌రెడ్డి (44) బెంగళూరులోని యశవంతపుర పీఎస్‌ పరిధిలోని మోహన్‌కుమార్‌ నగరలో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్‌ 28న రాత్రి 12:30 గంటల సమయంలో శంకర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. ప్రియునితో కలిసి భార్యే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేతికి గాయాలతో ఉన్న శంకర్‌రెడ్డి భార్యను పోలీసులు విచారించారు. దుండగులు తమపైన దాడి చేశారని, తాళి లాక్కెళ్లారని కట్టుకథ చెప్పింది.

అయితే తాళి మెడలోనే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి అంతమొందించినట్లు నిజం ఒప్పుకుంది. ప్రియుడు ఆమె సొంతూరికి చెందిన దూరపు బంధువని తెలిసింది. ఆమెను అరెస్టు చేసి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి పోయి, తల్లి జైలుకెళ్లి ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు.