పద్నాలుగేళ్ల పాటు ఏ లోటూ లేకుండా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నా. కేంబ్రిడ్జి చదువులు చదివించాను. ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ పీహెచ్‌డీ చదివిన నేను నా విజ్ఞానాన్నంతా నా బిడ్డకు పంచాను. నేను పని చేసే స్కూల్లో బాలికలకు కౌన్సెలింగ్‌ చేసేదాన్ని. నా బిడ్డకు నేర్పుకోనా? చదువు తప్ప మరో ధ్యాసలేని నా బిడ్డపై కామాంధుడి కళ్లు పడటం ఏమిటి.? బిడ్డ భవిష్యత్‌ కోసం ఎన్నో పూజలు చేశాను. అయినా దేవుడు మాకు అన్యాయం చేశాడు.

నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి. మాకు న్యాయం చేయండి’ అంటూ ఆత్మహత్య చేసుకున్న దీక్షిత గౌరి తల్లి అనురాధ ఆదివారం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దోషిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు.