లారీ డ్రైవర్‌, క్లీనర్ల రూపంలో మాటేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని యావత్‌ భారత దేశం నినదిస్తోంది. దేశావ్యాప్తంగా సంచనలంగా మారిన డాక్టర్‌ ప్రియాంక రెడ్డి దారుణ హత్య కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లారీ నెంబర్‌ ద్వారా నిందితుల్ని పట్టుకున్నారు. ts07ua3335 రాజేంద్రనగర్‌కి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన లారీగా గుర్తించారు.. గత కొంత కాలంగా శ్రీనివాస్‌ రెడ్డి దగ్గర ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషా పని చేస్తున్నాడు..

అత్యంత హేయంగా, క్రూరంగా జరిగిన డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితుల్ని మీడియా ముందుకు తీసుకురానున్నారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో మహ్మద్‌ పాషాను ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఫోటోను విడుదల చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌కు చెందిన మహ్మద్‌ పాషా లారీ డ్రైవర్‌. శంషాబాద్ టోల్‌గేట్ దగ్గరే ప్రియాంక రెడ్డిని గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్రియాంక తలపై గాయాన్ని పోస్ట్ మార్టంలో వైద్యులు గుర్తించారు. ప్రియాంక మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు వారు భావిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి కిరోసిన్‌ పోసి కిరాతకులు కాల్చేశారు. దాదాపు గంటపాటు డెడ్‌బాడీ కాలినట్లు భావిస్తున్నారు.

ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రుల్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

ఈ నీచులే డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు:

మహ్మద్‌ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌. వీళ్ళు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామస్తులు. వీరిలో చెన్నకేశవులు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు . గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో లారీ నంబర్‌ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్‌ పాషాది గుడిగండ్ల పక్క గ్రామమైన జక్లేర్‌. అతడి దగ్గర చెన్నకేశవులు, శివ, నవీన్‌ పనిచేస్తున్నారు.

ప్రియాంక రెడ్డి ప్రతిరోజూ ఇంటినుంచి స్కూటీపై టోల్ ప్లాజా వరకు వెళ్లి, అక్కడ స్కూటీ ఉంచి, అక్కడినుంచి బస్సులో తను పనిచేసే కొల్లాపూర్ వెళ్తుంది. తిరిగి బస్సులో వచ్చి స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇదే ఈ కిరాతకులు అవకాశంగా భావించి, ఆమె తిరిగొచ్చే లోగా స్కూటీ టైర్ పంచర్ చేశారు. ఆమెను తమ ట్రాప్ లో వేసుకున్నారు. ఈ నలుగురు ప్రియాంక స్కూటర్‌ టైర్‌ను పథకం ప్రకారం పంక్చర్‌ చేసి తర్వాత ఆమెను ట్రాప్‌ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.