పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని పోత్రహించడం క్షమించరాని నేరం అని అన్నారు. అమెరికా ఇస్తున్న నిధులను పాక్ దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. పుల్వామా దాడితో భారత్-పాక్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. రెండు దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల అధికారులతో మాట్లాడుతున్నా అని చెప్పిన ట్రంప్.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత సద్దుమణగాలని కోరుకున్నారు. భారత్ ఇప్పుడు చాలా బలంగా ఉందని.. పాకిస్తాన్‌ను ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఆత్మాహుతి దాడి చేసింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తోంది. దీని చీఫ్ మసూద్ అజార్.. భారత్‌కు వ్యతిరేకంగా స్థానిక యువకుల్లో విద్వేషం నింపి వారిని టెర్రరిస్టులుగా మార్చి భారత్‌పైకి వదులుతున్నాడు. పాక్ కేంద్రంగా భారత్‌లో ముష్కర దాడులకు కుట్రలు చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా.. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మాకేమీ తెలీదు అన్నట్టు వ్యవహరిస్తోంది.