నంబారు రేణుక అనే యువతికి కొంతకాలం క్రితం జగదీష్ అనే వ్యక్తితో పెద్దలు పెళ్లి చేశారు. ఐతే పెళ్లైన మూడు రోజులకే ఆమె గర్భవతి అని తేలడంతో భర్త ఆమెను వదిలేశాడు. అప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించిన రేణుక అతడితో హద్దులు దాటడంతో గర్భం దాల్చింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈలోగా రేణుక పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే మరో యువతితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్ ను రేణుక నిలదీసింది. పాప బాధ్యత తాను తీసుకుంటానని కొంత నగదు డిపాజిట్ కూడా చేస్తానని సర్ధిచెప్పి పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐతే రేణుకను వదిలించుకునే క్రమంలో శ్రీనివాస్ కు ఓ కన్నింగ్ ఐడియా తట్టింది. వెంటనే ఆమెను కూర్చొబెట్టి తన ప్లాన్ వివరించాడు. శ్రీనివాస్ పన్నికొడుకైన ప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఫోటోలు, ఫోన్ నెంబర్ రేణుకకు ఇచ్చిన శ్రీనివాస్, ప్రసాద్ ను లైన్లో పెట్టమని చెప్పాడు. ప్రియుడు చెప్పిన ప్లాన్ ను పక్కాగా అమలు చేసిన రేణుక ప్రసాద్ ను ముగ్గులోకి దించింది. పెద్దలకు చెప్పకుండా అతడ్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకునేలా చేసింది. ఉద్యోగ రీత్యా లక్నోలో ఉంటున్న ప్రసాద్ తన వెంటనే భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.

అక్కడ ఆమెకు లక్షలు విలువ చేసే బంగారం కొనిచ్చాడు. కొంతకాలం తర్వాత జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్ ను నమ్మించిన రేణుక వైజాగ్ వచ్చి ప్రియుడు శ్రీనివాస్ తో సెటిలైంది. ఈ లోగా కరోనా రావడంతో ప్రసాద్ విశాఖకు రాలేకపోయాడు. తరచూ భార్యతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని స్టంట్లు వేయాలంటూ తరచూ భర్త నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. అలా పలుసార్లు బైపాస్ అంటూ, గొంతుకు సర్జరీ అని, ఇతర చికిత్సల పేరుతో మొత్తం 45 లక్షలు లాగేసింది. చివరకు అమ్మ చనిపోయిందంటూ ప్రసాద్ ను నమ్మించింది. ప్రసాద్ ఆర్మీలో ఉండటం విశాఖ రాలేకపోతుండటంతో అతడికి తెలియకుండా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుడ్ని మరో పెళ్లి చేసుకుంది. చివరికి రేణుక అసలు రంగు బయటపడటంతో భర్త ప్రసాద్ గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.