ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము భార్యాభర్తలమని చెబుతూ, తమకు ఇంట్లోవారి నుంచి ప్రాణహాని ఉందని తెలియజేస్తూ పోలీసుల రక్షణ కోరారు. ఘజియాబాద్‌లోగల సిహానీ గేట్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ యువతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాము భార్యాభర్తలమని, తాము ఇంట్లోంచి పారిపోయివచ్చామని, తమ గురించి తెలుసుకున్న ఇంట్లోనివారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఇదే విషయమై పోలీసుల విచారణలో ఒక యువతి తండ్రి మాట్లాడుతూ 2018 నుంచి ఒక యువతి తమ ఇంట్లో అద్దెకు ఉండేదని, ఆమె, తమ కుమార్తె ఒకే కోచింగ్ సెంటర్లో చదువుకునేవారని తెలిపారు. కొంతకాలం తరువాత ఆ యువతి రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయినా, వీరిద్దరూ కోచింగ్ సెంటర్లో కలుసుకునేవారని చెప్పాడు.
కాగా వారు ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.