ఉన్నత పదవిలో వున్న అధికార పార్టీ నాయకుడు కాసుల కోసం కక్కుర్తితో నీచమైన దందా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఫాంహౌస్​లో ఆ నాయకుడు నిర్వహిస్తున్న వేశ్యాగృహం గుట్టు రట్టు అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటయిన మేఘాలయాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్​ వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని తన ఫాంహౌస్ లో భారీ ఎత్తున వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫార్మ్ హౌస్ పై ప్రత్యేక నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. 30వరకు చిన్న గదులున్న బెర్నార్డ్ ఎన్.మారక్​ ఫాంహౌస్​లో ఆయన సహచరులు నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై శనివారం పోలీసులు దాడులు చేశారు.

పార్మ్ హౌస్ కు భారీగా చేరుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించి మొత్తంగా 73 మంది ఈ వ్యభిచార దందాతో సంబంధమున్నవారిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్సీ విదేశా నంద్ సింగ్ తెలిపారు. రాజకీయవేత్తగా మారిన మాజీ మిలిటెంటు మారక్ పాంహౌస్ పై పక్కా ఆధారంగా దాడి జరిపినట్లు తెలిపారు. తాము రక్షించిన ఆరుగురు మైనర్లలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరిని అపరిశుభ్రంగా ఉన్న చిన్నగ దుల్లో తాళం వేసి బంధించి ఉంచారన్నారు. ఈ దాడిలో 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపర్చామని మైనర్ బాలికలను మాత్రం రెస్క్యూ హోంకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార దందాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.