భర్తకు దూరంగా ఉంటూ ఆమె(33) జీవనం సాగిస్తోంది. ఇంతలో ఆమెకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిచయమయ్యాడు. తనను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహాజీవనం సాగించాడు. ఈ క్రమంలో ఆమెకు శారీరకంగా దగ్గరై 14 సార్లు గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం ఎత్తాక 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇలా నమ్మిస్తూ మోసం చేయడంతో తీవ్ర మసస్థాపానికి గురైన బాధితురాలు చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారంః ఢిల్లీలోని జత్పూర్ ప్రాంతంలో ఓ మహిళ(33) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె డెడ్ బాడీ పక్కనే సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సూసైడ్ నోట్లో తనను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నేళ్లుగా తనతో సహజీవనం కొనసాగించాడని పేర్కొంది. ఈ క్రమంలో శారీరకంగా దగ్గర అవడంతో 14 సార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో అతను పెళ్లికి నిరాకరించడంతో వేరే దారిలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. అయితే, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఆమెకు తన భర్త నుంచి విడిపోయే 8 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోందని తెలిసింది. ఇదిలా ఉండగా ఆమె పేరెంట్స్ బీహార్లోని ముజఫర్పూర్లో నివాసముంటున్నారని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. ఇక, ఈ ఘటనలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.