ఎంతటి కష్టాన్ని అయినా, బాధను అయినా పైకి కనిపించనీయకుండా చేసే అస్త్రం చిరునవ్వు. ఆ నవ్వును అందరికీ పంచగల సత్తా ఒక్క కమెడియన్‌కే సొంతం. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న కమెడియన్‌ చాలాకాలంగా భరించలేని బాధను అనుభవిస్తోంది. కానీ పైకి మాత్రం ఆ బాధను, నొప్పిని కనిపించనివ్వకుండా జాగ్రత్తపడుతోంది. 2016లో ఆమె యాక్సిడెంట్‌కు గురవగా కాలు ఫ్రాక్చర్‌ అయింది. దీంతో ఆమె కాలిలో రాడ్డు వేశారు. కాలిలో రాడ్డు ఉన్నప్పటికీ టీవీ షోలలో గెంతుతూ, కుప్పిగంతులు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచింది రోహిణి. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె గతంలో కాలిలో వేసిన రాడ్డును తీయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు తీరా ఆ రాడ్డును తీయలేమంటూ చేతులెత్తేశారు.

రాడ్డులోపల కూరుకుపోయిందని, బలవంతంగా లాగితే దానికి అతుక్కున్న ఎముక విరిగే ప్రమాదం ఉందంటూ ఆ రాడ్డును అలాగే వదిలేశారు. దీంతో నిరాశకు లోనైన రోహిణి తన ప్రయత్నం విరమించలేదు. తనకు యాక్సిడెంట్‌ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మళ్లీ సర్జరీకి సిద్దపడింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో రోహిణి మాట్లాడుతూ: ‘గంటలో సర్జరీ చేస్తామన్నారు కానీ ఆ రాడ్డు రావడానికి 10 గంటలు పట్టింది. రాడ్డు సగందాకా వచ్చి ఆగిపోయిందట. చాలా కష్టపడి ఎలాగోలా దాన్ని బయటకు తీశారు. ఆరు వారాల దాకా కాలు కింద పెట్టకూడదన్నారు, చాలా కుట్లు వేశారు. ఎంతో నొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రోహిణి. ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.