రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ న్యాయస్థానం తీవ్రమైన శిక్ష విధించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. భారత్‌కు చెందిన ఓ 27ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటెయినర్‌ నుంచి కన్వేయర్‌ బెల్ట్‌పైకి ఎక్కించడం, అక్కడి నుంచి దించడం అతడి పని.

అయితే 2017 ఆగస్టు 11న ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహిస్తున్న అతడు ప్రయాణికులకు చెందిన ఓ పండ్ల బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగలించాడు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో తాను చాలా ఆకలిగా ఉన్నానని, దాహం కూడా ఎక్కువగా ఉండటంతో పండ్లను తీసుకున్నానని చెప్పాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

కాగా ఈ కేసును విచారించిన ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు సోమవారం తుదితీర్పు వెల్లడించింది. అతడికి 5000 దిర్హామ్‌(యూఏఈ కరెన్సీ)ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. ఈ తీర్పుపై అతడు 15 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే వీలుంటుంది.