వనదేవతలు మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఓరిస్సా రాష్ర్టాలలోని పలు జిల్లాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాలలో అధికసంఖ్యలో తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.

అనంతరం వాగు ఒడ్డున గల జంపన్నగద్దెకు, నాగులమ్మల గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తల్లుల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సాంప్రదాయ పద్ధతులలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తల్లుల మొక్కులకు అనుగుణంగా యాటపోతులు, కోళ్లు సమర్పించారు. గద్దెల పరిసరాలతోపాటు చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలలో చెట్ల కింద విడిదిచేసి వంటలు చేసుకుని బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా విందుభోజనాలు చేశారు.