మేనల్లుడి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తన స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తే ఆమెకే చుక్కలు చూపించాడు ఓ యువకుడు. ఆమె ప్రైవేట్‌ ఫొటోలను రికవరీ చేసి మరీ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. చివరకు ఆ ఫొటోలను వాట్సాప్‌ గ్రూపులో లీక్‌ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఆన్‌లైన్‌లో చదువుకుంటాడనే ఉద్దేశంతో తన స్మార్ట్‌ఫోన్‌ను మేనల్లుడికి ఇచ్చింది ఓ మహిళ(36). అయితే, ఆ యువకుడు మాత్రం ఫోన్‌ను మరోలా వాడాడు. ఫోన్‌లో రకరకాల సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ చేసి అప్పటికే డిలీట్‌ అయిన ఆమె వ్యక్తిగత చిత్రాలు కొన్నింటిని సేకరించాడు.

ఆపై ఆ ఫొటోలను చూపించి సొంత మేనత్తనే డబ్బు కోసం వేధించసాగాడు. ఈ క్రమంలో ఆమె డబ్బు ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి డబ్బు డిమాండ్‌ చేయగా విసిగిపోయిన ఆమె లేవని చెప్పింది. దీంతో కోపం పెంచుకుని ఓ వాట్సాప్‌ గ్రూపుల్లో వ్యక్తిగత ఫొటోలను లీక్‌ చేశాడు. గ్రూప్‌ సభ్యుల్లో ఓ దగ్గరి బంధువు కూడా ఉండడంతో విషయం ఆమె దాకా చేరింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా సదరు మేనల్లుడి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ఒడిషా కియోంజార్‌ జిల్లా ఆనంద్‌పూర్‌ పీఎస్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.