రాంచీ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 132/8 తో నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సౌతాఫ్రికా మరో పరుగు మాత్రమే జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. దాంతో కేవలం 9 నిమిషాల్లోనే భారత్ విజయం ఖాయమైంది. మొదటి ఓవర్ షమీ వేయగా వికెట్లు ఏమి పడలేదు. ఆతరువాత కోహ్లీ బంతిని అరంగేట్రం బౌలర్ నదీమ్ కు ఇవ్వగా ఆ ఓవర్ 5వ బంతికి కంకుషన్ సబ్ స్ట్యూట్ ఆటగాడు డీ బ్రున్ ను వికెట్ల ముందు దొరికిపోగా ఆమరుసటి బంతికే ఎంగిడి, నదీమ్ కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ గా వెనుదిరిగాడు.

అలా నదీమ్ హ్యాట్రిక్ కు చేరువైయ్యాడు. ఇక సౌతాఫ్రికా అవమానకర రీతిలో వరుసగా రెండో సారి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి భారత పర్యటనను ముగించింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో చిత్తుగా ఓడిపోయినా ప్రొటీస్ జట్టు రెండో టెస్ట్ లో 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో పరాజయాన్ని చవిచూడగా చివరి టెస్ట్ లో 202 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

పూర్తిగా వన్ సీడెడ్ గా జరిగిన ఈ సిరీస్ ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసి సొంత గడ్డపై ఎదురులేదని మరోసారి నిరూపించింది. అంతేకాదు టెస్టుల్లో సౌతాఫ్రికా ను మొదటి సారి వైట్ వాష్ చేసి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇక ఈవిజయం తో వరుసగా 5మ్యాచుల్లో గెలిచి 240 పాయింట్ల తో భారత్ నెంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది…