వరంగల్‌: హన్మకొండలో నర్సింగ్ స్టూడెంట్ రవళి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. రోహిణి నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో బీఎస్పీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్న కుందారపు రవళి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.‌ ఆత్మహత్యకు ముందు భీమదేవరపల్లి మండలం ములకనూరులో నివాసముండే తల్లికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. కంగారుపడ్డ తల్లి వారించే లోగానే రవళి ప్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే హాస్టల్లో ఉండే తోటి విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు అప్రమత్తమై రవళిని రోహిణి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళిని చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ విద్యార్థులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నానికి నర్సింగ్ కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు.