వరంగల్‌ జిల్లా: డిగ్రీ వరకు చదివిన యువతి తనకు ఉద్యోగం రాదనే భయంతో మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో చోటు చేసుకుంది. 16వ డివిజన్‌ ధర్మారంలో నివాసం ఉంటున్న ఊదర రవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయిలు ఇద్దరికి వివాహం అయ్యింది. చిన్న కుమార్తె మేఘన డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మేఘన డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరీలో మేఘన తన మనసులో బాధను పేపర్‌ మీద అక్షర రూపంలో వెల్లడించింది. ‘‘డిగ్రీ వరకు చదివిన నేను నా కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు.

మా నాన్న ఆరేళ్ల క్రితం మద్యం మానేసి మాతో బాగానే ఉంటున్నాడు బాగా చూసుకుంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసినా జాబ్‌ రావడం లేదనే సమస్య నన్ను కుదురుగా ఉండనీయడం లేదు. ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను’’ అంటూ తన మనసులో గూడుకట్టుకున్న వ్యధను వెల్లడించింది. ‘‘అందరు జాబ్‌ కోసం ప్రయత్నించి రిజల్ట్‌ వచ్చాక గెలిచారో ఓడిపోయారో అర్థం అవుతుంది. కానీ నా విషయంలో మాత్రం నేను ప్రయత్నించకుండానే ఓడి పోతున్నాను. అమానాన్న​ నన్ను క్షమించండి మిస్‌ యూ అక్కలు, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి’’ డైరీలో రాసుకుంది. జాబ్‌ రావడం లేదన్న బాధలోనే మేఘన ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందరూ బాగుండాలని కోరుకుని నువ్వేందుకు నీ జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగించావు తల్లి మేం గుర్తుకు రాలేదా అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.