మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గడ్డిగూడెం తండాలో ఒక కసాయి తండ్రి తన పిల్లలను బావిలో పడేసి హత్య చేశాడు. శిరిష, రామ్ కుమార్ ఇద్దరు దంపతులు. రామ్కుమార్ సీఎస్ఎఫ్ జవాన్గా ముంబైలో పనిచేస్తున్నాడు. వీరికి జాక్సన్(8), జానిబేస్టో(6) పిల్లలు. ఇతను నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. రామ్కుమార్ తన భార్య బంగారాన్ని గతేడాది బ్యాంక్లో కొదువపెట్టి డబ్బుతీసుకున్నాడు. తాజాగా, ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. శిరిష తన బంగారాన్ని తీసుకురావాలని భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రామ్కుమార్ భార్యపై చేయిచేసుకున్నాడు.
ఆ తర్వాత క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి బావిలో పడేసి, గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రామ్కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.