శంషాబాద్‌లో యువ వైద్యురాలి హత్యకేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్‌ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడిందని గుర్తు చేశారు. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యువతి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.

అంతకుముందు ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్‌ శంషాబాద్‌ ఘటనను ప్రస్తావించి తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రి డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన, అమనుషమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.