మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరగాలని, బహిరంగ బ్యాలెట్‌ విధానంలో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్‌ నిర్వహించాలని ఆదేశించింది. బలపరీక్ష మొత్తం వీడియో తీయాలని న్యాయస్థానం పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో నేడు తీర్పు వెలువరించింది.