హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే తన జీవితంలో చివరి రోజు అయింది దేవుడి దగ్గరకు వెళుతున్నానని చెప్పిన ఆ యువతి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది 19 ఏళ్ళ యువతిని గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దీనదయాళ్‌నగర్‌లో ఈ యువతి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. బుధవారం పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని చెప్పి, యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.

చాలా సేపటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసి గుండెలవిసేలా ఏడ్చారు.. పుట్టిన రోజే , నీకు ఆఖరి రోజైందా బిడ్డా అంటూ రోదించారు. యువతి శవం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శరీరంపై పెద్దగా గాయాలు లేవు.

కాగా మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఎక్కువ. వీధి దీపాలు లేక పోవడంతో చీకటిగా ఉంటుంది. యువతిని కిడ్నాప్‌ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశారా? ఇది ఆమెకు తెలిసిన వారి పనేనా? గుట్టు బయటపడకుండా ఉండేందుకు హత్య చేసి ఉంటారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…