ఆర్నెళ్ల క్రితమే ఆ జంటకు పెళ్లయ్యింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లారు. తమ కొత్త జీవితాన్ని మధురంగా మలుచుకోవాలనుకున్నారు. కానీ వారొకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. నూరేళ్ల జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న న‌వ దంపతుల క‌ల‌లు కళ్లలయ్యాయి. సముద్రపు ఒడిలో సరదాగా గడుపుదామని నోటిలోపలకి దిగిన భర్త విగతజీవిగా మారగా ఆ నవ వధువుకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే: హైదరాబాద్‌ నాగోల్‌ డివిజన్‌ అజయ్‌నగర్‌లో రాముని రవీందర్‌, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె రవీందర్ అల్కాపురిలో హోటల్ నిర్వహిస్తుండగా చిన్న కుమారుడు వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వంశీకృష్ణకు గతేడాది జూన్ 23న కర్మాన్‌ఘాట్‌కు చెందిన యువతితి పెళ్లి జరిగింది. నూతన ఏడాది హనీమూన్ కోసం కొత్త జంట కోసం వారు ఈనెల 13న ఇండోనేసియా, మలేసియా వెళ్లారు. ఈ క్రమంలో ఇండోనేసియాలోని బాలి సముద్ర దీవి వద్ద కాటేజీలో కొత్త దంపతులు బస చేశారు. ఈనెల 22న (ఆదివారం) వంశీకృష్ణ సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించాలనుకున్నాడు. భార్యను తాము బస చేసిన కాటేజీలోనే వదిలేసి ఒంటరిగా బయలు దేరాడు.

కళ్లద్దాలు, కాళ్లకు రక్షణ చెప్పులు, ఆక్సిజన్‌ సిలిండర్‌ ధరించి వంశీకృష్ణ సముద్రంలోకి దిగాడు. అనంతరం కాసేపటికే అతడు గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు కాటేజీలో ఉన్న భార్యకు సమాచారం అందించారు. అదేరోజు వంశీకృష్ణ మృతదేహాన్ని సముద్రం నుంచి వెలికితీశారు. భర్త మరణ వార్త తెలిసి షాక్‌కు గురైన భార్య హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అదించింది. దీంతో హుటాహటిన కుటుంబ సభ్యులు బాలి బయల్దేరి వెళ్లారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన తన కుమారుడు అకాల మరణం చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల తెలంగాణలో వెలువడిన గ్రూప్-1 పరీక్షల్లోనూ వంశీకృష్ణ సత్తాటాడని, మెయిన్స్‌కు కూడా అర్హత సాధించాడని విలపించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా మరణించటంతో వారు గుండెలవిసేలా రోధించారు. ఇదిలా ఉండగా ఆది, సోమవారాలు బాలిలో వరుస సెలవులు ఉన్నాయి. దీంతో వంశీకృష్ణ మృతదేహం తరలింపులో జాప్యమైందని, గురువారం నాటికి చేరుకోవచ్చని బంధువులు రవిందర్‌ వెల్లడించారు.